నిష్కామకర్మే అత్యుత్తమం
- B Ashok Kumar
- Jun 3, 2018
- 2 min read
Updated: Jun 5, 2018
అన్నిటికీ మూలం కర్మే. ఏ కర్మనూ చేయాల్సిన అవసరం లేకపోయినప్పటికీ తాను కూడా అందరికీ మార్గదర్శకత్వం కోసం కర్మను చేస్తున్నానని గీతాచార్యులు చెప్పారు. కర్మలలో కూడ ఫలాపేక్ష లేని కర్మే మిక్కిలి ఉత్తమమైనది. అది నిష్కామ కర్మ. అటువంటి కర్మను ఆచరించే జనకాది రాజర్షులు తరించారు. అటువంటి కర్మను ఆచరించిన వారే మోక్షాన్ని పొందగలరు.
కర్మాచరణం అంటే కర్మను ఆచరించడం. అసలు కర్మను ఎందుకు ఆచ రించాలి ? ఆచరిస్తే ఎలాంటి కర్మను ఆచరించాలి? భగవద్గీతలో జగద్గురువు కర్మ గురించి కొన్ని విషయాలు తెలిపారు. కర్మను ఆచరించక పోవడం కన్న ఆచరించడమే మంచిదని ఆయన తెలిపారు. కర్మ వలన యజ్ఞం, యజ్ఞం వల్ల్ల వర్షం, వర్షం వల్ల్ల అన్నం, అన్నం వల్ల్ల ప్రాణులు పుడుతున్నాయి. అందుచేత అన్నిటికీ మూలం కర్మే. ఏ కర్మనూ చేయాల్సిన అవసరం లేకపోయినప్పటికీ తాను కూడా అందరికీ మార్గదర్శకత్వం కోసం కర్మను చేస్తున్నానని గీతా చార్యులు చెప్పారు. కర్మలలో కూడ ఫలాపేక్ష లేని కర్మే మిక్కిలి ఉత్తమమైనది. అది నిష్కామ కర్మ. అటువంటి కర్మను ఆచరించే జనకాది రాజర్షులు తరిం చారు. అటువంటి కర్మను ఆచరించిన వారే మోక్షాన్ని పొందగలరు. దీనికొక పురాణ కథ ఉంది. దేవర్షి , సర్వలోక సంచారి అయిన నారదుడు ఒకసారి అరణ్యమార్గంలో వెళుతూ, ధ్యాన నిమగ్నుడై ఉన్న ఒక పురుషుని చూసాడు. అతని మీద పుట్టలు పెరిగి ఉన్నాయి. అతడు నారదుని చూసి 'తాపసోత్తమా! మీరెక్కడకు వెళుతున్నారు? అని అడగ్గా 'కైలాసానికి' అని నారదుడు చెప్పేడు. అప్పుడతడు తనకు ముక్తి ఎప్పుడు వస్తుందో భగవంతుని కనుక్కు రమ్మని నారదుని ప్రార్థించాడు. నారదుడు సరే అని కొంత దూరం వెళ్లిన తర్వాత మరొక పురుషుడు కనబడ్డాడు. అతడు ఆడుతూ, పాడుతూ ఎగిరి గంతులు వేస్తూ నారదుని చూసి, 'మునీంద్రా! తమరెక్కడకు వెళుతున్నారు?' అని ప్రశ్నించేడు. 'కైలాసానిక'ని నారదుడు చెప్పగానే అతడు పరమేశ్వరుని అనుగ్రహం తనకెప్పుడు లభిస్తుందో కనుక్కురమ్మని వేడుకున్నాడు. నారదు డంగీకరించి తన దారిన తాను వెళ్ళిపోయాడు. కాలక్రమంలో నారదుడా త్రోవనే తిరిగి రావడం తటస్థించింది. చెదల పుట్ట్టలో ఉన్న తాపసి దేవర్షిని చూసి, 'మునివరా! నా గురించి దేవదేవుడు ఏమన్నాడు?' అని ప్రశ్నించేడు. 'ఇక నాలుగు జన్మలలో నీకు ముక్తి అని పరమేశ్వరుడు చెప్పాడన్నాడు. అప్పుడతడు చెదలు నాపై పుట్టలు పోసేవరకూ ధ్యానిస్తున్నానే. అయ్యో! నేనింకా నాలుగు జన్మలు ఎత్తాలా? అని పెద్దగా ఏడవసాగాడు. నారదుడు రెండవ వాని వద్దకు వెళ్ళగానే అతడు తన గురించి మహాదేవుడు ఏమి చెప్పేడు అని ప్రశ్నించేడు. నారదుడు అక్కడొక చింత చెట్ట్టును చూపి, 'దానికి ఎన్ని ఆకులున్నాయో నీవన్ని జన్మలనెత్తాలి. అప్పుడు నీకు ముక్తి' అని పరమేశ్వరుడు చెప్పాడని తెలిపాడు. దానితో అతడు ఇంత శీఘ్ర కాలంలో నాకు ముక్తి లభిస్తుందా? అని ఆనందపరవశుడై నాట్యం చేయసాగాడు. వెంటనే అశరీర వాణి 'నా తండ్రీ! నీవీ క్షణానే ముక్తుడివవుతావు' అని పలికింది. అతని ఫలాపేక్ష లేని కర్మాచరణకది ప్రతిఫలం. ఎన్ని జన్మల సాధనకైనా అతడు సిద్ధ పడి ఉన్నాడు. ఇక మొదటి వానికి నాలుగు జన్మలే దుర్భరమైన దీర్ఘకాలంగా తోచింది. అతడు చేసే తపస్సు శీఘ్ర కాలంలో ముక్తి లభించాలనే కోరికతో కూడుకున్నది. అదే కామ్య కర్మ. రెండవ వాడు చేసేది నిష్కామ కర్మ. యుగ యుగాలవరకూ నిరీక్షించి ఉండడానికి అతడు ఇష్టపడి ఉన్నాడు. అటువంటి కర్మే మహోన్నత ఫలదాయకమవుతుంది. మనం పూజ చేసేప్పుడు సంకల్పంలో క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యా భివృద్ధ్యత్వం, ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యత్వం అని గంపెడు కోరికలు కోరుతూ ఇష్ట కామ్యార్థ సిద్ధికి పూజ చేస్తున్నాం లేదా దేవాలయాల్లో చేయిస్తున్నాం. పూజ వైదికమైనా చేసేది కామ్య కర్మే. భగవంతుని పూజించేటప్పుడు మనకేం కావాలో ఆయనకు మనం చెప్పాలా? మన యోగ క్షేమాలన్నీ ఆయన చూసుకుంటాడనే నమ్మకంతోనే మనం ఆయన్ని అర్చించాలి. ఆరాధించాలి, సేవించాలి.
Comments